by సూర్య | Sun, Mar 29, 2020, 05:17 PM
ఏపీ సీఎం జగన్ మంత్రులు,అధికారులతో కలిసి లాక్ డౌన్ పరిస్థితుల పై సమీక్షించారు. ఆ తర్వాత ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు బయట తిరిగే వెసులుబాటు కల్పించారు. కానీ కొంత మంది ఈ సమయాన్ని ఆసరాగా చేసుకొని వృథాగా బయటికి వస్తున్నారు. దీంతో బయట తిరిగే సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే బయట తిరగడానికి అనుమతించింది. అది కూడా సరుకుల కోసం,అత్యవసరమైన వాటికి మాత్రమే బయటికి రావాలి. ఇంటి నుంచి ఒక్కరే బయటికి రావాలి. పోలీసులు అడిగినప్పుడు సరైన ఆధారాలు చూయించకపోతే చర్యలు తప్పవని సర్కార్ ప్రజలను హెచ్చరించింది. అదే విధంగా ప్రజలు కూరగాయల మార్కెట్ దగ్గర ఎక్కువ సేపు వేచి చూడకుండా ఎక్కడికక్కడ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి మార్కెట్ లో కూరగాయల ధరల పట్టికను ఏర్పాటు చేయాలని, ఆ బోర్డుపైనే ఎక్కువ ధరకు అమ్మితే ఫిర్యాదు చేసే కాల్ సెంటర్ నంబర్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు ఏపీలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సర్కార్ లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేసింది.
Latest News