by సూర్య | Sat, Mar 28, 2020, 02:05 PM
కరోనా వైరస్ ఇండియాలోకి ప్రవేశిస్తే... ఇంకేమైనా ఉందా... అసలే ఇండియాలో సరైన వైద్య సదుపాయాలు ఉండవు అన్నారు చాలా మంది.
అది పూర్తిగా నిజం కాదనీ... రోజులు మారాయని నిరూపించారు మినాల్ దఖావే భోశాలీ.
వైరాలజిస్ట్ అయిన ఆమె... ఓవైపు ప్రసవ వేదనతో బాధపడుతూ కూడా... నొప్పులను తట్టుకుంటూ... కరోనా వర్కింగ్ టెస్ట్ కిట్ను 6 వారాల్లో తయారుచేశారు.
అది తయారుచేసిన తర్వాత కొన్ని గంటలకే ఆమెకు డెలివరీ అయ్యి పాప పుట్టింది. ఇదే కిట్ విదేశాల్లోనైతే తయారుచెయ్యడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది.
ఈ సందర్భంగా గురువారం (26-3-2020) తొలి మేడ్ ఇన్ ఇండియా కరోనా టెస్ట్... మార్కెట్లోకి వచ్చింది.
తద్వారా ఇండియన్స్ కూడా ఎక్కువ మందిని తక్కువ సమయంలో స్క్రీనింగ్ చేసేందుకు అవకాశం లభించింది.
దేశంలో తొలిసారిగా... పుణెలోని మైలా డిస్కవరీ కంపెనీకి టెస్టింగ్ కిట్స్ తయారీ, అమ్మకం అనుమతులు లభించాయి. మొదటి 150 కిట్లను పుణె, ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరులోని డయాగ్నోస్టిక్ ల్యాబ్లకు పంపింది.
రెండో బ్యాచ్ కిట్లను సోమవారం పంపబోతోంది. ఇంతకు ముందు ఈ కంపెనీ హెచ్ఐవి, హెపటైటిస్ బి వంటి రోగాలకు కూడా టెస్టింగ్ కిట్లు తయారుచేసింది.
వారానికి లక్ష కొవిడ్-19 టెస్టింగ్ కిట్లను తయారుచేయగలమన్న కంపెనీ నిర్వాహకులు... అవసరమైతే... 2 లక్షలు కూడా ఉత్పత్తి చేస్తామన్నారు.
ప్రస్తుతం ఒక్కో కరోనా టెస్టింగ్ కిట్నీ రూ.1200కి అమ్ముతున్నారు. అదే విదేశాల నుంచీ దిగుమతి చేసుకోవాలంటే భారత్ రూ.4500 చెల్లించాల్సి వచ్చేది.
ఈ కిట్ ద్వారా రెండున్నర గంటల్లో టెస్టింగ్ పూర్తవుతుంది. కరోనా ఉన్నదీ లేనిదీ తెలిసిపోతుంది. అదే విదేశీ కిట్ల ద్వారా ఈ విషయంతెలియడానికి 6 నుంచి 7 గంటలు పడుతోంది.
ప్రెగ్నెన్సీ కారణంగా సెలవుపై ఫిబ్రవరిలో ఇంటికి వచ్చిన భోశాలీ... తనే టెస్ట్ కిట్ చెయ్యాలని అనుకున్నారు. అదో చాలెంజ్గా తీసుకున్నారు.
మొత్తం 10 మంది టీమ్తో కలిసి... విజయవంతంగా పని పూర్తి చేసి... మార్చి 18న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి)కి టెస్ట్ కిట్ను పంపారు.
ఆ తర్వాత ఇండియన్ ఎఫ్ డీఎ, డ్రగ్స్ కంట్రోల్ అథార్టీ సీడీఎస్ఓలను వాణిజ్యపరంగా తయారుచేసేందుకు అనుమతి కోరారు. వెంటనే అనుమతి లభించింది.ఈ కిట్ ద్వారా ఒకే శాంపిల్ని 10 సార్లు టెస్ట్ చేసినా... ఫలితాలు ఒకేలా వస్తాయి. అందువల్ల ఈ కిట్కి అనుమతి లభించింది.
Latest News