by సూర్య | Fri, Mar 27, 2020, 03:46 PM
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ బాధ్యతలు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేతిలో పెట్టింది. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించేందుకు ఇద్దరు మంత్రులను కేంద్రం రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 33 జిల్లాల అధికారులతో కిషన్ రెడ్డి సంప్రదింపులు జరపనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు చెందిన అధికారులతో సమన్వయం చేసే బాధ్యతను నిర్మల తీసుకోనున్నారు. అనంతరం కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా అధికారులతో చర్చించి వీరిద్దరూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు. వాటి ఆధారంగా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగాలకు తగిన సూచనలు ఇవ్వాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 11 మందికి కరోనా నిర్ధారణ అయింది.
Latest News