by సూర్య | Fri, Mar 27, 2020, 11:50 AM
ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ను నియంత్రించడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని కోర్టుల కార్యకలాపాలను నిలిపివేయాలని ఏపీ హై కోర్టు నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్ కోర్టు ఇటీవల కరోనా వ్యాప్తి నియంత్రణపై కూలంకషంగా చర్చించి ఈ నెల 31వ తేదీ వరకు హై కోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, న్యాయసేవాధికార సంస్థ తదితరాల కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ సెలవులను పొడిగిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ నోటిఫికేషన్ వెలువరించారు. ఈ నెల 24వ తేదీన జారీ చేసిన ప్రకటనను సవరిస్తూ గురువారం మరో నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, చీఫ్ జస్టిస్ అనుమతితో అత్యవసర కేసులపై మాత్రం విచారణ జరపనున్నారు. అత్యంత అవసరం ఉన్న కేసుల విచారణ జరిపేందుకు ఇటీవల ప్రకటించిన తేదీలను కూడా హైకోర్టు రద్దు చేసింది.
Latest News