by సూర్య | Wed, Mar 25, 2020, 02:57 PM
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం బాసగా నిలవాల్సిన వాడు పెళ్లైన 8 నెలలకే ఆమెను హత్య చేశాడు. ఎవరికి తెలియకుండా మిస్సింగ్ డ్రామా ఆడి ఆమెను బొంద పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఎన్వీఆర్ వీధికి చెందిన కుమారి,భాస్కర్ ల కుమార్తె గాయత్రి.ఆమెకు ప్రస్తుతం 28 సంవత్సరాలు. తిరుపతిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసింది. ఆమె రోజు కాలేజికి బస్సులో వెళ్లి వచ్చేది. ఆర్టీసి అద్దె బస్సుకు డ్రైవర్ గా కురబలకోట మండలం వనమరెడ్డిగారి పల్లెకు చెందిన మల్ రెడ్డి పని చేసేవాడు. గాయత్రి రోజూ బస్సుకు కాలేజీకి వెళ్లడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా వెళ్లి 12 ఫిబ్రవరి 2019న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తగాదాలయ్యాయి. చివరకు మల్ రెడ్డి కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానిచ్చారు. కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత గాయత్రిని కట్నం కోసం మల్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు వేధించడం ప్రారంభించారు. దీంతో 2019 సెప్టెంబర్ 10న ముదివేడు పోలీసులకు గాయత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అందరికి సర్ది చెప్పారు. సజావుగా కాపురం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత 2 జనవరి 2020 నుంచి గాయత్రి కనిపించలేదు. జనవరి 6న మల్ రెడ్డి తన భార్య కనపడడం లేదని మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. గాయత్రి తన తల్లికి జనవరి 2న ఫోన్ చేసి ప్రాణహాని ఉందని తెలిపింది. ఈ విషయాన్ని గాయత్రి తల్లి పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు మల్ రెడ్డిని, కుటుంబ సభ్యులను తమదైన శైలిలో విచారించారు. గాయత్రిని చంపి పొలంలో పూడ్చేసినట్టు మల్ రెడ్డి ఒప్పుకున్నాడు. దీంతో గాయత్రి మృతదేహాన్ని పూడ్చిన స్థలాన్ని పోలీసులు వెలికి తీయిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.
Latest News