by సూర్య | Wed, Mar 25, 2020, 01:41 PM
కరోనా వైరస్ నేపథ్యంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు. దీంతో ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ను తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతునట్టు సమాచారం. సాధారణంగా మార్చి నాటికి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండాలి. కానీ స్థానిక ఎన్నికల కారణంగా పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలకు బదులు ఈ నెలాఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని జగన్ సర్కారు భావించింది. కానీ, కరోనా దెబ్బకు అది కూడా జరిపే అవకాశం లేనందున ఆర్డినెన్స్ ఆలోచన చేస్తోంది. బడ్జెట్ సమావేశాలు జరపకుండా, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కొత్త ఏడాదిలో రాష్ట్ర ఖజానా నుంచి నిధులు వినియోగించుకునే అవకాశం ఉండదు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సాధ్యం కాదు. అందుకే ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం జగన్ ఆలోచిస్తునట్టు సమాచారం. గతంలో కూడా రెండు సార్లు ఆర్డినెన్స్ ద్వారానే బడ్జెట్ ను అమల్లోకి తీసుకొచ్చారు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు ఆర్డినెన్స్ ద్వారానే బడ్జెట్ ను తీసుకొచ్చారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కొంత కాలం రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు కూడా ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ను అమల్లోకి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Latest News