by సూర్య | Tue, Mar 24, 2020, 09:40 AM
రాష్ట్రంలో కరోనా నివారణ కోసం లాక్ డౌన్ను పటిష్టంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ నివారణ చర్యలకు సంబంధించి సోమవారం పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కేవలం నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కరికి మాత్రం అనుమతులు మంజూరు చేయాలన్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని, తీవ్రతను వివరించి ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాల్సిన బాధ్యతను అధికారులు గుర్తు చేయాలని సూచించారు. సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు అందుబాటులో ఉన్న వనరులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా సోకిన వారిలో 80.9 శాతం మంది హోం ఐసోలేషన్లోనే ఉంటూ కోలుకుంటున్నారని తెలిపారు. కేవలం 13.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. అందులో కేవలం 4.7 శాతం మంది మాత్రమే ఐసీయులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 450 వెంటిలేటర్లతో పాటు 1300 బెడ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు.
Latest News