by సూర్య | Sat, Mar 21, 2020, 06:08 PM
జనతా కర్ఫ్యూను ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది.. అందరూ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండవలసిందిగా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవుతారు కావున పోలీసు వారు అప్రమత్తతో ఉంటారని తెలిపారు.
పోలీస్ కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తామన్నారు. ఇది స్వచ్ఛందంగా ప్రజలు తమకు తాముగా పాటించే కర్ఫ్యూ మాత్రమే అన్నారు. డయల్ 100 ద్వారా విస్తృతంగా, నిరంతరంగా సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ ఒక ప్రదేశంలో సుమారు 12 గంటల వరకు జీవించి ఉంటుందన్నారు. జనతా కర్ఫ్యూ 14 గంటలు పాటించడం ద్వారా కరోనా వైరస్ జీవించి ఉన్న ప్రదేశాలను ఎవరు స్పృశించరు. తద్వారా అట్టి గొలుసును ఛేదించడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధించడం అనేది ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. కావున జనతా కర్ఫ్యూని ప్రజలందరూ పాటించి మన సంకల్పాన్ని చాటి చెబుదామన్నారు.