by సూర్య | Sat, Mar 21, 2020, 05:21 PM
దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండడంతో మాస్కులు,శానిటైజర్లను కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. కరోనాను అడ్డు పెట్టుకొని కొంత మంది వ్యాపారులు మాస్కులు,శానిటైజర్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు,శానిటైజర్లకు ధరలు నిర్దేశించింది. నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీకి ముందు ఉన్న మాస్కుల ధరలనే కొనసాగించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.
సర్జికల్ మాస్కు (టు, త్రీ ప్లై రకం) రిటైల్ ధర రూ. 8 అని, దాన్ని పది రూపాయలకంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే, 200 ఎమ్.ఎల్. హాండ్ శానిటైజర్ బాటిల్ ధర రూ. 100 దాటకూడదని చెప్పారు. మిగతా సైజుల బాటిళ్ల ధరలు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయని తెలిపారు. 2020 జూన్ 30 వ తేది వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయన్నారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.