by సూర్య | Sat, Mar 21, 2020, 05:01 PM
ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. మృతుల సంఖ్య 11,417కి చేరింది. గంటగంటకూ అది విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 276462 మందికి కరోనా వైరస్ సోకగా ఇప్పటివరకూ 91954 మంది వైరస్ నుంచీ కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 1356 మంది చనిపోయారు. దాదాపుగా నిన్న ఒక్కరోజే నిమిషానికి ఒకరు చనిపోయారని అంచనాలో తేలింది. ప్రధానంగా చైనా కంటే ఎక్కువ మృతుల సంఖ్యను కలిగివున్న ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే 627 మంది చనిపోయారు. అందువల్ల మృతుల సంఖ్య 11వేలు దాటేసింది. ఒక్క ఇటలీలోనే మృతుల సంఖ్య 4వేలు దాటింది. ఆ దేశంలో 47వేల మందికి కరోనా వైరస్ సోకింది. ఇటలీ తర్వాత స్పెయిన్, జర్మనీ, అమెరికా, ఇరాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, బ్రిటన్లో కూడా కరోనా కేసుల్లో మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 258కి చేరింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్లో తొలిసారిగా కరోనా కేసు నమోదైంది. దేశంలో అధికంగా కేసులు ఉన్న మహారాష్ట్రలో కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 63కి చేరింది. కేరళలో 40, రాజస్థాన్లో 23, ఉత్తరప్రదేశ్లో 23, తమిళనాడులో 3, పంజాబ్లో 2, ఢిల్లీలో 26, జమ్మూకాశ్మీర్లో 4, ఒడిశాలో 2, తెలంగాణలో 19, ఆంధ్రప్రదేశ్లో 3, మధ్యప్రదేశ్లో 4, బెంగాల్లో 3 కేసులు పాజిటివ్గా ఉన్నాయి.