by సూర్య | Sat, Mar 21, 2020, 02:00 PM
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు.. ఉద్యమం కొనసాగుతుందని రైతులు తేల్చి చెప్పారు. రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు శనివారం 95వ రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని తరలిస్తామని చెప్పినప్పుడే తాము చచ్చిపోయామని, ఇప్పుడు కరోనా వైరస్కు భయపడమన్నారు. కరోనా వైరస్ కన్నా జగన్ ప్రమాదకరమని మండిపడ్డారు. రాజధాని కోసం భూములిస్తే జైలుకు పంపారని వాపోయారు. ఒకరికొకరు దూరంగా కూర్చోని నిరసనలు తెలిపారు. కొంతమంది ముఖాలకు మాస్క్లు కట్టుకొని నిరసన తెలిపారు.
తుళ్లూరు, రాయపూడి, పెదపరిమి, తాడికొండ-అడ్డరోడ్డులోనూ రైతుల ఆందోళనలు, దీక్షలు జరిగాయి. వెలగపూడిలో కొంత మంది యువకులు రిలే నిరాహారదీక్షలకు దిగారు. రైతుల ఆందోళనలకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ అశోక్బాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ గద్దె అనూరాధ, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ సంఘీభావం తెలిపారు. తాడేపల్లి మండలం రాజధాని గ్రామం ఉండవల్లిలో.. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.