by సూర్య | Fri, Mar 20, 2020, 08:33 PM
అమరావతి రాజధాని కోసం దీక్షలు చేస్తున్న రైతులకు కరోనా దెబ్బ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో అమరావతి రైతులను కూడా దీక్షలు విరమించాలని పోలీసులు కోరారు. ఈ మేరకు తుళ్లూరు మహాధర్నా శిబిరానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైతుల దీక్షలను కొంత కాలం పాటు వాయిదా వేయాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి దీక్షలు చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో అమరావతి రాజధాని జేఏసీ అత్యవసర సమావేశంలో చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని రైతులు పోలీసులకు తెలిపారు. రాజధానిగా అమరాతినే కొనసాగించాలంటూ వరుసగా 94వ రోజూ(శుక్రవారం) ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, తాడేపల్లి, నీరుకొండ, పెనమాక, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తాడేపల్లి తదితర ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు.గురువారం వినూత్నంగా రైతులు నిరసన తెలిపారు. అతి భయంకరమైన కోవిడ్-19 ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుకొని, పారసిటమల్ మాత్ర వేసుకుంటే సరిపొతుందని సీఎం జగన్ చెప్పారని, అయితే, తమ గ్రామాల్లో బ్లీచింగ్ చల్లిన నాథుడే లేడని రాయపూడిలో రైతులు, మహిళలు పేర్కొన్నారు. గ్రామంలో బ్లీచింగ్ చల్లి, పారాసిటమల్ టాబ్లెట్లు పంపిణీ చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. నారాకోడూరు రైతులు శివపార్వతుల వేషాలతో శిబిరాల్లో శివతాండవం చేసి నిరసన తెలిపారు.కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా గురువారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈనెల 22న జనతా కర్య్ఫూ విధించాలని, ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ ఎక్కడికీ వెళ్లరాదని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమరావతి రైతులకు కూడా దీక్షలు, ధర్నాలు వాయిదా వేసుకొక తప్పదు.
Latest News