by సూర్య | Sun, Feb 16, 2020, 07:33 PM
ఏపీ శాసనమండలి రద్దుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ కు కేంద్రం భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మండలిని రద్దుచేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసి పంపింది... ఆ తీర్మానంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. వచ్చే మార్చిలోనే శాసనమండలి కథ ముగిసిపోతుందని సమాచారం. రెండు రోజుల క్రితం అమిత్ షాను కలిసిన సీఎం జగన్ సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు... ఈ సందర్భంగా శాసనమండలిని రద్దు చేయాలని అమిత్ షాను కోరినట్టు తెలిసింది.
అమిత్ షా సూచన మేరకే ఈనెల 15న సీఎం జగన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కలిశారు.... వాస్తవానికి సీఎం జగన్ ఏపీకి తిరుగుప్రయాణం అవ్వాలని భావించినా... చివరి నిమిషంలో కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లభించడంతో ఆయన్ను కలిశారు... హైకోర్టు తరలింపు వ్యవహారం న్యాయశాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి రవిశంకర్ ప్రసాద్ను కలసి చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని గతంలో బీజేపీ కూడా హామీ ఇచ్చింది కాబట్టి, ఆ మాటకు కట్టుబడి హైకోర్టు తరలింపునకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 3వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో దఫా ప్రారంభం కానున్నాయి... ఆ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం శాసనమండలి రద్దు బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చి వెంటనే మండలిని రద్దు చేయాలని జగన్ కోరగా, అందుకు కేంద్రం కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది.