by సూర్య | Sun, Feb 16, 2020, 05:06 PM
మద్యపాన నిషేధం అమల్లో కొత్త సవరణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణస్వామి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన డీసీ, ఏసీ, ఈఎస్, డీఎంలతో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ మద్యపాన నిషేధం అమలుపరుచుటలో అవకతవకలకు పాల్పడితే అధికారుల మీద కూడా చర్యలు తప్పదని హెచ్చరించారు. సూపర్ వైజర్, వాచ్ మెన్, సేల్స్ మెన్ లకు ఏజెన్సీల ద్వారా సక్రమముగా జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఐడీ, ఎన్ డీపీఎల్ కేసుల్లో పీడీ యాక్ట్ ను ఖఛ్చితంగా అమలుపరచాలన్నారు. మద్యం అక్రమ రవాణా వాహనదారుల యజమానుల మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు.
Latest News