by సూర్య | Sun, Feb 16, 2020, 04:07 PM
బెల్లం లేదా చక్కెర అంటే ఇష్టపడని వారుండరు. ఈ రెండింటిని అమితంగా ఆరగిస్తుంటారు. అయితే, బెల్లం తినడం కంటే కూడా చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్రూట్ జ్యూసులు, డెజర్టులు చక్కెరతో కలిపి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి. కానీ చక్కెర ఎక్కువ వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. రకరకాలైన అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. శరీరంలోకి చక్కెర ఎక్కువగా చేరుతున్న కొద్దీ మన ఒంట్లో జీవ క్రియలు అస్తవ్యస్తం అవుతాయి. బరువు అదుపు తప్పుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఇన్సులిన్ నిరోధకత వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... చక్కెర కూడా మద్యంతో సమానమే అంటారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో చక్కెరకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను ప్రయత్నించడం మేలు. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం ద్వారా అనేక సమస్యలు వాటిల్లుతాయి. మరి చక్కెర వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో బ్లడ్ షుగర్ పెరగకుండా సహజ తీపిదనాన్ని కలిగి ఉండే తేనె, పళ్ల లాంటి వాటిని వాడితే శరీరానికి ఎంతో మంచిది. స్వీటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కానీ... వాటిని చక్కెరతో తయారుచేస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు. చక్కెరకు బదులు ఆర్గానిక్ బెల్లం, చెరుకురసం, ద్రాక్షపళ్లు, తేనె, ఖర్జూరం, ఎండుద్రాక్ష, ఆప్రికాట్స్, తాజా పళ్లను పదార్థాల్లో వాడితే ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరంలోకి అధిక మోతాదులో చక్కెర చేరినట్టయితే కాలేయం దెబ్బతింటుంది. అధికంగా చక్కెరను తీసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా తీపి పదార్థాలు తినడం వల్ల దంతాలు పుచ్చిపోతాయి. చెడు బ్యాక్టీరియా నోరంతా వ్యాపిస్తుంది. శరీరంలో చక్కెర చేరడం వల్ల మధుమేహం వ్యాధి వస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ చక్కెరలో ఉండవు. ప్రాసెస్సింగ్ ఫుడ్స్, శీతలపానీయాలు తాగడం వల్ల అధిక బరువు పెరుగుతారు. శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బుల బారినపడుతారు.