by సూర్య | Thu, Feb 13, 2020, 04:30 PM
మార్చి 15 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ప్రారంభమైన వారం, పది రోజుల్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకుని ఆ తర్వాత ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సవరణలకు బీజం వేస్తూ పంచాయతీరాజ్ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. వ్యవసాయ మండలి ముసాయిదా బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. రాజధాని - అభివృద్ది వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే, శాసనసభ ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసనమండలిలో బ్రేక్ పడింది. వాటిని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించడంతో పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం చేసింది.
Latest News