by సూర్య | Thu, Feb 13, 2020, 02:28 PM
ఓ పెళ్లివిందులో చికెన్ కూర దగ్గర మొదలైన గొడవ.. రాళ్లు విసురుకుని కేసులు నమోదు చేసుకునే స్థాయికి వెళ్లింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సారవకోట రెల్లి వీధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సారవకోట రెల్లి వీధికి చెందిన సురేష్కు బూర్జ మండలం ఉప్పెనవలస గ్రామానికి చెందిన యువతితో వివాహం చేసేందుకు నిర్ణయించారు. వివాహ వేడుకలో భాగంగా సారవకోటలోని వరుడి ఇంటి వద్ద బుధవారం మధ్యాహ్నాం వివాహ విందును ఏర్పాటుచేశారు. అయితే భోజన సమయంలో చికెన్ కూర ఎక్కువగా వేయలేదని పెళ్లికుతూరు తరపున వచ్చిన ఓ వ్యక్తి కోరారు. అప్పటికే చికెన్ తక్కువగా ఉండడం.. చికెన్ వేయాలని అడిగిన వ్యక్తి ప్లేట్లో చికెన్ ఉండడంతో ముందు ఉన్నది తినగానే వేస్తానని భోజనం వడ్డిస్తున్న వరుడి తరపు వ్యక్తి అన్నాడు. వధువు తరపు వ్యక్తి కూర వేయలేదన్న కోపంతో ప్లేట్ను భోజనం వడ్డిస్తున్న వ్యక్తిపైకి విసిరికొట్టాడు. దీంతో చిన్న గొడవ కాస్త.. ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారిని పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ మాటామాటా పెరిగి ఒకరిపై మరొకరు పోలీసుల ముందే రాళ్ల విసురుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇరువర్గాలతో పోలీసులు మాట్లాడి గొడవను సద్దుమణిగించారు. వివాహ విందు సమయంలో గొడవ జరిగినా.. యథావిధిగా పోలీసులు వివాహం జరిపించారు.
Latest News