by సూర్య | Wed, Feb 12, 2020, 06:27 PM
ప్రాణం తీపి అంటే ఏమిటో తమదాకా వచ్చిందాకా నిర్భయ దోషులకు తెలియలేదు. ఉరితాడు కళ్లముందు కనపడుతున్నా, చావు వాళ్లను నీడలాగా వెంటాడుతున్నా.. ఉరి తప్పదని తెలిసినా ప్రాణాలు నిలుపుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక సాకుతో ఉరితీతను వాయిదా వేయించుకోవాలని లేదా రద్దు చేయించుకుని ప్రాణాలతో అయినా జైలులో ఉండాలన్న తాపత్రయం ఆ కిరాతకులలో ప్రతి ప్రయత్నంలోనూ కనపడుతోంది. తాజాగా.. పవన్ గుప్తా తన తరఫున వాదిస్తున్న లాయర్ను తొలగించేశాడు. మళ్లీ లాయర్ ను పెట్టుకునే వరకు ఉరిశిక్ష అమలుని ఆపాలని కోరుతున్నాడు. ఒక పథకం ప్రకారమే ఉరిశిక్షను వాయిదా వేయించేందుకే తన తరపున వాదిస్తున్న లాయర్ ని తొలగించేసి తాను మళ్లీ లాయర్ ని పెట్టుకునే వరకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. ఇందుకు స్పందించిన కోర్టు.. తామే లాయర్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు హాలులోనే ఉన్న నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శిక్ష అమలును జాప్యం చేసేందుకే దోషులు నాటకాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Latest News