by సూర్య | Tue, Feb 11, 2020, 07:21 PM
ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లపై తీవ్ర దుమారం రేగుతోంది. పెద్ద మొత్తంలో పెన్షన్లు కట్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు చాలా మంది బాధితులు రోడ్డలపైకి వచ్చి ఆందోళన చేశారు. అర్హులైన తమకు పెన్షన్ తొలగించారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పెన్షన్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... అర్హత ఉన్నా పెన్షన్ రాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని సూచించారు. పెన్షన్లపై వెరిఫికేషన్ చేశాక అర్హత ఉందని తేలితే... వారికి రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే.. ఐదు రోజుల్లో పెన్షన్కార్డు ఇస్తామని తెలిపారు సీఎం జగన్.
''రాష్ట్రంలో కొత్తగా 6,14,244 మందికి పెన్షన్లు ఇచ్చాం. ఐనా పథకం అందలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెన్షన్ దరఖాస్తులను ఫిబ్రవరి 17 నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్ చేయాలి. 18కల్లా అప్లోడ్ చేసి, 19, 20 తేదీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించాలి. తుది జాబితాను 20న ప్రకటించాలి. మార్చి 1న కార్డుతో పాటు, పెన్షన్ ఇవ్వాలి.'' అని అధికారులను జగన్ ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని స్పష్టం చేశారు. అర్హులైన ఏ ఒక్కిరికీ అన్యాయం జరగకూడదని సూచించారు.
బియ్యం కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. అర్హులైన వారిలో ఎవ్వరికీ బియ్యం కార్డు రాలేదనే మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 18 కల్లా బియ్యం కార్డుల రీ వెరిఫికేషన్ పూర్తి చేసి... ఫిబ్రవరి 15 నుంచి బియ్యంకార్డుల పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందవద్దని చెప్పాలన్న జగన్.. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా కార్డు వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఫిబ్రవరి 15 నుంచి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం. మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ పూర్తికావాలని అధికారులకు గడువు విధించారు.