by సూర్య | Thu, Jan 16, 2020, 03:44 PM
అమరావతి : బీజేపీ-జనసేన ఉమ్మడి సమావేశం ముగిసింది. ఏపీలో ఇకపై ఇరు పార్టీలూ కలిసి నడవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అత్యంత కీలకమైన రాజధాని విషయంపై కూడా వీరు ఓ స్పష్టతకు వచ్చారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకించాలని ఇరువురూ ఓ ఏకాభిప్రాయానికి వచ్చారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ... మాతో కలిసి పనిచేయడానికి జనసేన ముందుకు వచ్చిందని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం బీజేపీ- జనసేనతోనే సాధ్యమని, ఇరువురం కలిసి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు. 2024 అధికారమే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామని తెలిపారు. వైసీపీ నియంతృత్వ వైఖరిపై గతంలో టీడీపీ చేసిన అవినీతిపై కలిసి పోరాడతామని కన్నా ప్రకటించారు.
Latest News