by సూర్య | Mon, Jan 13, 2020, 05:50 PM
ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రక్షణవలయంగా కన్పించే బ్లాక్ క్యాట్ కమాండోలు ికపై కన్పించరు. చంద్రబాబు ఒంటిమీద ఈగ కూడా వాలకుండా ఆయనని కాపాడే ఎన్ఎస్ జీ కమాండోలు ఇకపై ఆయన చుట్టూ ఉండరు. ఇప్పటికే ఎస్పీజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్ ఇప్పుడు ఎన్ ఎస్ జీ సెక్యూరిటీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సహా దేశం మొత్తం మీద 13 మంది ప్రముఖులకు కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇకపై వీరందరి సెక్యూరిటీని పారా మిలిటరీ దళాలు చూస్తాయని స్పష్టం చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోదఫా అధికారాన్ని చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా 350 మంది వీఐపీలకు భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. గాంధీ ఫ్యామిలీ, మన్మోహన్ సింగ్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే గడచిన 20 సంవత్సరాలుగా బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలుచుకునే ఎన్ఎస్జీ బృందాలు, వీఐపీల భద్రతలో ఉందన్న విషయం తెలిసిందే. జడ్ ప్లస్ విభాగంలో ఉన్న వారందరి భద్రతనూ వీరు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కొక్కరికీ 25 మంది బ్లాక్ క్యాట్ కమాండోల చొప్పున భద్రతను కేంద్రం కల్పించగా, ఈ వీఐపీల జాబితాలో చంద్రబాబుతో పాటు రాజ్ నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, శర్వానంద సోనోవాల్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ఎల్కే అద్వానీ, ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులున్నారు.
Latest News