by సూర్య | Mon, Oct 14, 2019, 07:54 PM
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. పెట్టుబడి సాయం రూ.13,500 లకు పెంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో రైతులకు కొంతవరకు ఊరట లభించనుంది. ఈ పథకాన్ని వైయస్సార్ రైతుభరోసా పిఎం కిసాన్ యోజన పేరుతో అమలు చేయనున్నారు. అయితే రైతులకు అందించే ఈ పెట్టుబడిని మూడు విడతలుగా చెల్లిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వివరించారు. విడతల వారీగా రైతు భరోసా ఇవ్వాలని రైతులు కోరారని, రైతుభరోసా పథకాన్ని నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లు పాటు అమలుచేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లక్షల మంది రైతులకు నేరుగా పెట్టుబడి అందుతుందని తెలియచేశారు. రైతులకు మే నెలలో 7500, ఖరీఫ్ పంటల కోతల సమయంలో , రబీ అవసరాల నిమిత్తం మరో 4,000 చెల్లిస్తామని చెప్పారు. సంక్రాంతి వేళ చివరి విడతగా రూ.2,000 అందిస్తామని మంత్రి కన్నబాబు వివరించారు. ప్రస్తుతం 40 లక్షల మందికి రైతుభరోసా అందిస్తున్నామని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు ను మరింత పెంచుతున్నామని చెప్పారు. నవంబరు 15 వరకు రైతుభరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Latest News