by సూర్య | Mon, Oct 14, 2019, 12:35 PM
మంగళగిరి సమీపంలో నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేస్తామంటూ మంగళగిరి తహసీల్దార్ రామ్ ప్రసాద్ పార్టీ ఆఫీస్ సిబ్బందికి నోటీసులను అందజేశారు. ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తకు అనుగుణంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి నవంబరు 3 తేదీ ఆదివారం సాయంత్రం 7.19 నిమిషాలకు టీడీపీ శ్రేణులు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ప్రముఖ దినపత్రికలో అది అక్రమ నిర్మాణం అంటూ కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. భవన నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల 65 సెంట్లను కేటాయించగా ఒక రైతుకు చెందిన భూమిని కూడా ఆక్రమించుకున్నారని, పైగా పక్కనే ఉన్న వాగును పూర్తిగా పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని సదరు పత్రిక కధనం రాసింది. అంతే కాకుండా రెండు బేస్మెంట్లు, మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని మూడు బేస్మెంట్లు, నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీనిని ఆధారంగా తీసుకుని మంగళగిరి తహసీల్దార్ రామ్ప్రసాద్ నోటీసులు జారీ చేసి ఏడు రోజులలోపు ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన రేగింది.
Latest News