by సూర్య | Sun, Oct 13, 2019, 01:29 PM
రైతు భరోసా పథకం ఇంకా బాలారిష్టాలు దాటి లేదు. అర్హుల ఎంపికలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాబితాను రూపొందించటంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 79 లక్షల రైతు ఖాతాలుంటే అందులో 30లక్షల ఖాతాల వివరాలు రైతు జాబితాలో సరిపోవటం లేదు. రైతు భరోసాకు ప్రజాసాధికార సర్వేను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఇదే రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తప్పులతడకగా ఉన్న ప్రజాసాధికార సర్వే కారణంగా అధికశాతం మంది రైతులు రైతుభరోసాకు అనర్హులవుతున్నారు. ఆధార్ కూడా తిప్పలు తెస్తోంది. అధిక శాతం మంది రైతుల ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాలేదు. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా ప్రకారం 7లక్షల మంది ఆధార్ వివరాలు తప్పుగా నమోదయ్యాయి. రైతుల భూ వివరాలతో ఇవి సరిపోలట్లేదు. కౌలు రైతుల గుర్తింపులోనూ కష్టాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా. సాగుదారు హక్కులచట్టం కింద ఇచ్చే కార్డులు ఇంకా మొదలు కాలేదు. ఫలితంగా కౌలురైతులకు గుర్తింపు ప్రశ్నార్థకమవుతోంది. పీఎం కిసాన్ నిధులుపొందే వారిని మినహాయిస్తే మిగిలిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ఏడాదికి 12వేల 500 ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో ఇదీ సమస్యగా మారనుంది.
Latest News