by సూర్య | Sun, Oct 13, 2019, 01:26 AM
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, తిరుపతి వాసుల తాగునీటి అవసరాలు తీర్చే వరప్రసాదిని బాలాజీ రిజర్వాయర్ అని తిరుపతి శాసన సభ్యులు మరియు టిటిడి ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన్ కరుణాకర్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారులు, టిటిడి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శనివారం సాయంత్రం బాలాజి రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చే భక్తులకు, తిరుపతివాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు బాలాజీ రిజర్వాయర్ ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తిరుమల కొండల నుండి 1 టిఎంసీ వర్షపు నీరు వృధాకు పోతోందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారని, ఈ నేపథ్యంలో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా నేరుగా బాలాజీ రిజర్వాయర్ కు తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దాదాపు 3.3 కి.మీ వైశాల్యంలో రూ.350 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని, ఇప్పటికే 574 ఎకరాల భూమిని సేకరించారని, 500 హెక్టార్ల అటవీ భూమి అనుమతులు పొందినట్లు తెలిపారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో తిరుమలకు విచ్చేసే భక్తులతో పాటు, భగవంతునితో అనుసంధానం ఉన్న తిరుపతివాసుల తాగునీటి అవసరాలు తీరనున్నాయన్నారు. రోజుకు సరాసరి లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తున్నారని, భవిష్యత్ లో భక్తులకు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ఈ రిజర్వాయర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు. అనంతరం అధికారులతో కలిసి మల్లిమడుగు రిజర్వాయర్ ను పరిశీలించారు.
Latest News