by సూర్య | Sat, Oct 12, 2019, 09:17 PM
ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. విశాఖ జిల్లాలోని నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో ఏడు నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడారు. జగన్ అహంకారం రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెట్టుతోందని ఆరోపించారు. తనకు స్వాగతం పలికేందుకు విశాఖ విమానాశ్రయానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకున్నారని, దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం ప్రజా వ్యతిరేకమని అభివర్ణించారు. అక్రమంగా కేసులు పెడితే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయా? అని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా కొల్లు రవీంద్ర దీక్ష చేయడంలో తప్పేమిటని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలను కేసుల ద్వారా అణగదొక్కాలని చూస్తే బాధ్యులైన పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టి న్యాయస్థానాల చుట్టూ తిప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. నరేగా నిధులను రాజ్యాంగ విరుద్ధంగా ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులివ్వకుండా నిధులు మళ్లిస్తూ మనన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులకు రాష్ట్రం లెక్కలు చెప్పాలి. లేదంటే ఆపై నిధులు ఆపేస్తారు. అలా చేస్తే రాష్ట్రంలో ఏ ఒక్క పని చేయలేరు అని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నట్లుందన్నారు.
Latest News