by సూర్య | Fri, Oct 11, 2019, 06:43 PM
రాష్ట్రం లో పాఠశాలల అభివృద్ధి, సంస్కరణలు, తదితర విషయాల్లో ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు ప్రణాళికతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖ పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని అన్నారు. మనబడి కార్యక్రమం లో భాగంగా నాడు - నేడు ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. విద్యా నవరత్నాలు అమలుకు కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, కొత్తగా కావలసిన ప్రతిపాదనలు, మరమ్మతులు పై చర్చించారు. మరుగుదొడ్లు లో నీటి వసతులు, పాఠశాలల్లో విద్యుద్దీకరణ పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పాఠశాల ప్రహారీలకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన పేరెంట్స్ కమిటీ ల విధి విధానాలు వారికి తెలిపి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. పాఠశాలల అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని అన్నారు. సమావేశం లో ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, కమిషనర్ సంధ్యారాణి, బాలకృష్ణన్, నాగరాజు, ప్రతాపరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.
Latest News