by సూర్య | Sun, Aug 25, 2019, 06:41 PM
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సమర్థులు ఉన్నారని, టిడిపి కి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ అన్నారు. భరత్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పార్టీలో ఇప్పుడున్న నాయకులు సమర్థులేనని, వారితో పార్టీ పటిష్ఠంగానే ఉందని భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్న వాదనతో తాను ఏకీభవించనని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడిగా, ఛరిష్మా ఉన్న నటుడుగా జూనియర్ ఎన్టీఆర్ ను కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది కదా! అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే ఆ విషయం తమ పార్టీ అధినేతకు తెలియజేయాలని, ఆపై వారిద్దరూ చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకుంటారని భరత్ వివరించారు.
అయితే, ప్రస్తుతం టీడీపీలో ఉన్న యువ నాయకత్వం కొత్త ఆలోచనలతో ముందుకెళ్లగలిగితే పార్టీని తామే బలోపేతం చేసుకోగలమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట సామాన్యులే ఉన్నారని, వారందరూ జూనియర్ ఎన్టీఆర్లు కాదు కదా అంటూ భరత్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
Latest News