by సూర్య | Sun, Aug 25, 2019, 06:13 PM
తిరుమలలో అన్యమత ప్రచారంపై ఘాటుగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులు స్వచ్ఛందంగా తిరుమలను విడిచి వెళ్లిపోవాలని కోరారు.
తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఆదివారం అధికారులతో సమావేశమైన ఆయన... ఆర్టీసీ బస్సు టికెట్లపై ఇతర మతాలకు చెందిన ప్రకటనలు వున్న ఘటనపై సమీక్షా సమావేశం జరిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో అన్యమత ప్రచారం గర్హనీయమైన చర్యన్నారు. ఈ ఘటనలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. మ్యూజియంల అభివృద్ధితో పాటు సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల అంశాలను అధికారులతో చర్చించారు సీఎస్.
గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన అనుభవం వుండటంతో అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో, జేఈవో పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం తిరుమల ఆర్టీసీ బస్టాండ్లో టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వాటి వెనుక ఇతర మతాలకు సంబంధించిన ప్రకటనలు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది.