by సూర్య | Thu, Aug 22, 2019, 07:28 PM
టిటిడిలో పాలనాసౌలభ్యం కోసం విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ ఆఫీస్ విధానం ద్వారా మరింత వేగంగా పేపర్ రహిత పాలన అందించాలని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో ఛాంబర్లో గురువారం ఐటీ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో స్వామివారి దర్శనార్థం అమలు చేస్తున్న పోటో బయోమెట్రిక్ విధానంతోపాటు ఐరీష్ టెక్నాలజీ వినియోగంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వసతి సౌకర్యాల నిర్వహణలో భాగంగా తిరుమలలోని టిటిడి కల్యాణమండపాలను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల రోజువారి దర్శన సంఖ్య తెలుసుకునేందుకు వీలుగా డాష్బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. టిటిడికి సంబంధించి కౌలు, అద్దె చెల్లింపులు ఆన్లైన్లో చెల్లించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు.
వచ్చే ఏడాది నుండి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా టిటిడి విద్యాసంస్థలలో ఆన్లైన్ ప్రవేశాల అప్లికేషన్ను అమలు చేసేందుకు వీలుగా ఇప్పటినుండే అప్లికేషన్ను రూపొందించాలని ఐటీ అధికారులను ఆదేశించారు. టిటిడి కార్యక్రమాల నిర్వహణ మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా ప్రతి శాఖలోనూ సమగ్రంగా, క్రమబద్ధంగా ఖర్చుల నిర్వహణ ఉండాలని సూచించారు. ఇంజనీరింగ్ విభాగంలో అభివృద్ధి పనుల అంచనాల వివరాలను దశలవారీగా ఈ ఆఫీస్ ద్వారా పంపాలని, ముందుగా తిరుపతిలోని ఈఈ స్థాయి నుంచే పంపేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఈని ఆదేశించారు. శ్రీవారిసేవ చేసేందుకు ఏర్పాటు చేసిన ఆన్లైన్ అప్లికేషన్లో సులభంగా సేవకులు ఎలా నమోదు చేసుకోవాలనే అంశంపై వివిధ భాషలలో డెమో రూపొందించాలని ఐటీ అధికారులకు సూచించారు.
Latest News