by సూర్య | Wed, Aug 21, 2019, 09:15 PM
టిటిడి పరిధిలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 8 నుండి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 7న సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సెప్టెంబరు 8వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు చతుష్ఠార్చాన, పుణ్యాహవచనం, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 9.00 నుండి 1.00 గంటల వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 10న ఉదయం 6.00 నుండి 1.00 గంటల వరకు మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం 6.00 గంటల నుండి స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం, పవిత్ర వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Latest News