by సూర్య | Wed, Aug 21, 2019, 05:42 PM
అమరావతికి వరద ముంపు పొంచి ఉందన్న విషయం తాజా వరదలతో నిరూపితం అయిందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజధాని ప్రాంతాన్ని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో పుల్లారావు మీడియాతో మాట్లాడారు. ఒకవేళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తే ఉద్యమిస్తామని, అవసరమైతే ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వైసీపీ ప్రభుత్వానికి ముక్కుతాడు వేయాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత టీడీపీ హయాంలో జరిగిన అవక తవకలపై కమిటీలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. అదే సమయంలో అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకొంది. ఏఐఐబీ కూడా అమరావతికి సహకారం ఇచ్చే ప్రతిపాదనను విరమించు కుంది. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమరావతి రాజధానిగా సరిపోదంటూ గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రతిపాదించింది. ఈ విషయాన్నే బొత్స సత్యనారాయణ చెప్పారు.
Latest News