by సూర్య | Mon, Jun 24, 2019, 08:21 PM
పార్టీ ఫిరాయింపులు, వలసలపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే పార్టీలు మారిపోతారా అంటూ ప్రశ్నించారు. ఏదో పదవులు కావాలని అధికారంలో ఉండాలన్న కాంక్షతో ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఓటమిపాలైతే ధైర్యం కోల్పోతున్నారని విమర్శించారు.
అలా అభద్రతతో పార్టీలు మారుతున్నారంటూ పవన్ అభిప్రాయపడ్డారు. ఖచ్చితంగా పదవులు కావాల్సిన వారు అభద్రత భావంతో పార్టీలు మారుతుంటారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలరోజుల్లో పార్టీ మారిపోవడం సరికాదన్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే జనసేన పార్టీని వీడాలనుకునేవారు ప్రస్తుతం ఎవరూ లేరని పవన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ పార్టీని వీడాలనుకునే వారు తనను సంప్రదించి వీడితే బాగుంటుందన్నారు. వారితో తాను చర్చిస్తానని అప్పటికీ వీడాలనుకుంటే చేసిందేమీ లేదన్నారు. తాను ఒక భావజాలంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నానని దాని నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే అది వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు. ఏవేవో కారణాల వల్ల పార్టీ ఫిరాయింపులకు పాల్పడాల్సి వస్తోందని తెలుస్తోందన్నారు. జనసేన పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Latest News