by సూర్య | Sun, Jun 23, 2019, 02:52 PM
రాష్టంలో మధ్యాహ్న భోజన పథకం అక్షయ పాత్రకు సంస్థ ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. . ఇప్పటికే ఈ దస్త్రాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంతకం చేయటంతో ఇక నుంచి ఏజన్సీల స్థానంలోకి అక్షయ పాత్ర ప్రవేశించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పౌష్టికతతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం పథక నిర్వహణ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలలోని ఉపాధ్యాయులతో మధ్యాహ్న భోజనం పంపిణీ కోసం ప్రతిపాఠశాలలో ప్రత్యేక కమిటీలు ఉన్నా ఏజన్సీలు ఇష్టారాజ్యంగా భోజనం పంపిణీ చేశాయనే ఆరోపణలున్నాయి.
ఈ ఏజన్సీలకు రాష్ట్రప్రభుత్వం పౌరసరఫరాల శాఖ నుంచి బియ్యం, కందిపప్పు అందేది. అలాగే కుకింగ్ చార్జీల కింద ప్రాథమిక స్థాయిలో రూ.4.35 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిలో రూ.6.51 ఒక్కో విద్యార్థికి చెల్లించేవారు. అయితే సకాలంలో కుకింగ్ చార్జీలు చెల్లింపులలో ప్రభుత్వ జాప్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారన్నది వాస్తవం. మధ్యాహ్న భోజన ఏజన్సీలు ఒక మాఫియాలా తయారు కావటంతో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు భోజన పంపిణీ పై అజమాయిషి దాదాపు కోల్పోయారు. ఈ క్రమంలోనే అక్షయపాత్రకు మధ్యహ్నభోజన పథక నిర్వహణ కేటాయించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించడంతో ఉపాధ్యా యుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించుకున్నా అప్పోసప్పో చేసి ఇప్పటి దాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించిన ఏజన్సీల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏజన్సీలలో పనిచేస్తున్న 90 వేల మందికి పైగా మహిళల ఉపాధి కరువై, రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. వీరికి ప్రత్యామ్నాయంగా ఎదైనా ఉపాధి చూపుతారా? లేక శాశ్వతంగా వారికి సెలవు ఇస్తారా? అనేది ప్రభుత్వం ఇంకా తేల్చలేదు.
Latest News