by సూర్య | Sun, Jun 23, 2019, 01:54 PM
సామాన్య భక్తుల సేవలోనే తరిస్తానని, స్వామి దర్శనం క్షణాలలో జరిపించేస్తామంటూ భారీ హామీలిచ్చిన టీటీడీ నూతన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా చైర్మన్ కుటుంబ సభ్యులు, అనుచరులతో ఆలయమంతా సందడి చేయటంతో సామాన్యభక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంకోసం మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్లో భక్తులను సుమారు గంట పాటు ఆపేశారు. , అన్ని క్యూలైన్లలోనూ వైసిపి నేతలు, కార్యకర్తలు ఉండటంతో ముందుకు వెళ్లలేక పోయారు. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది పాసులున్న వారిని మాత్రమే లోనికి అనుమతించి మిగిలినవారిని ఆపేశారు తమకు పరిమిత సంఖ్యలో పాసులు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద చైర్మన్ అనుచరులు కొందరు హంగామా చేయటంతో క్యూలైను స్తంభించి భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆపై కల్యాణం గృహస్తు లను దర్శనానికి అనుమతించినా కల్యాణోత్సవం కూడా కాస్త ఆలస్యంగా నిర్వహించాల్సి వచ్చింది. చైర్మన్ వెంట వాహనశ్రేణి బుగ్గ కార్లతో వీవీఐపీ పర్యటనను గుర్తుతెచ్చే విధంగా ఏటీసీ గేటు వరకు ప్రయాణించడంపై కూడా భక్తులలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా ప్రమాణ స్వీకారం రోజునే గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు నిలచిపోవటం చూస్తుంటే, ఇక రానున్న రోజులలో నేతల తాకిడి మరింత పెరిగితే సామాన్య భక్తులకి కష్టాలు మరిన్ని రావన్న గ్యారంటీ లేదన్న వాదనలూవినిపిస్తున్నాయి.
Latest News