by సూర్య | Sat, Jun 22, 2019, 10:47 PM
అనంతపురం నగరం జీసెస్నగర్లోని నారాయణ స్కూల్ ముందు విద్యార్థి సంఘం నేతల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నడిపిస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ఫీజుల విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. స్కూల్ ఫర్నీచర్, కిటికి అద్దాలు ధ్వంసం చేశారు. నారాయణ స్కూల్ సిబ్బంది దురుసుగా వ్యవహరించడంతో దాడి చేసినట్టు విద్యార్థి సంఘం నాయకులు చెప్పారు.
నారాయణ స్కూల్ లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ దగ్గరికి వెళ్లారు. స్కూల్ మేనేజ్ మెంట్ తో విద్యార్థి సంఘం నేతలకు వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థి సంఘం నేతలు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్ ని ధ్వంసం చేశారు. ఫీజుల దోపిడీ ఆపాలని పదే పదే చెప్పినా స్కూల్ మేనేజ్ మెంట్ పట్టించుకోలేదని విద్యార్థి సంఘం నేతలు చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా.. పుస్తకాల పేరుతో డబ్బు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని వాపోయారు. అధిక ఫీజులు వసూలు చేయొద్దని కలెక్టర్ ఆదేశించినా.. నారాయణ స్కూల్ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కూల్ లోనే బుక్స్ కొనాలని కండీషన్స్ పెడుతున్నారని.. బుక్స్ కోసమే రూ.9వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నడిపిస్తున్నారని, విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు చేసిన ఆరోపణలను నారాయణ స్కూల్ మేనేజ్ మెంట్ ఖండించింది. తాము నిబంధనలకు అనుగుణంగా స్కూల్ ని నడిపిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేయడం లేదన్నారు. తప్పు.. విద్యార్థి సంఘం నాయకులదే అని చెప్పారు. తాము వివరణ ఇస్తున్నా పట్టించుకోలేదని, కావాలనే దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై స్కూల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించిందని విద్యార్థి సంఘం నేతలు కూడా కంప్లయింట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.