by సూర్య | Sat, Jun 22, 2019, 09:42 PM
ప్రజావేదిక నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు ప్రభుత్వం తేల్చింది. సీఆర్డీఏ అనుమతి లేకుండానే నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారించిన అధికారులు.... మంత్రి బొత్స సత్యనారాయణకు డిటైల్ట్ రిపోర్ట్ ఇచ్చారు. 5కోట్ల రూపాయల అంచనాలను దాదాపు 9కోట్లకు పెంచి నిర్మాణం చేపట్టారని తేల్చారు. ఎలాంటి అనుమతి లేకుండా కృష్ణానది కరకట్టపై ప్రజావేదిక నిర్మాణం చేపట్టడమే కాకుండా, ఆనాటి మంత్రి నారాయణ నోటి మాటతో టెండర్లు లేకుండానే కాంట్రాక్టు ఇచ్చినట్లు మంత్రి బొత్సకు అధికారులు నివేదిక ఇచ్చారు. ప్రజావేదిక వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు ప్రజావేదిక ఇంకా తనదే అనుకోవడం సరికాదన్నారు. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అధికారిక భవనాలు కేటాయించలేదని.. ఇప్పుడు చంద్రబాబును కూడా అలాగే ట్రీట్ చేస్తామని ఆయన అన్నారు. ప్రజావేదిక నిర్మాణంలో కూడా చంద్రబాబు దోపిడీ చేశారని.. ఆయన ఉంటున్న ఇల్లు కూడా అక్రమకట్టడమేనని బొత్స వెల్లడించారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం కలెక్టర్ల సమావేశాలకు ఓ భవనం కూడా నిర్మించలేదని బొత్స మండిపడ్డారు. ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేందుకు ఇకపై కలెక్టర్ల సదస్సు ప్రజావేదికలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా ప్రజావేదిక నిర్మాణంలో జరిగిన అవినీతిని బయటపెట్టింది ఏపీ ప్రభుత్వం. సీఆర్డీఏ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు నిర్ధారించారు. ఐదు కోట్ల అంచనాలను 8.90 కోట్ల రూపాయలుగా మార్చినట్లు సీఆర్డీఏ అధికారులు తమ నివేదికలో పేర్కొంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు నివేదికను అందజేశారు. ఈ అక్రమ కట్టడాలపై ఏ చర్యలు తీసుకోవాలన్నది త్వరలోనే నిర్ణయిస్తామని బొత్స తెలిపారు.
Latest News