మినిస్ట్రీపై అన్నదమ్ముల మధ్య రచ్చ!

by సూర్య | Fri, Jun 21, 2019, 08:10 PM

గజం స్థలం కోసం అన్నదమ్ములు కొట్టుకున్న సందర్భాలున్నాయి. ఆస్తి వివాదాలపై రచ్చ చేసుకున్న ఘటనలు కోకొల్లలు. ఇంత చిన్నవాటికే బ్రదర్స్‌ గొడవ పడినప్పుడు, ఇక మినిస్ట్రీపై అన్నదమ్ముల మధ్య రచ్చ రాదా వస్తుంది. అవును. ఒక్క మంత్రి పదవి, ఆ సోదరుల మధ్య అగాథాన్ని పెంచింది. ముఖం ముఖం చూసుకోలేని పరిస్థితి తెచ్చింది. అన్నకు ఇచ్చారని తమ్ముడు రగిలిపోతున్నాడు. తమ్ముడికి దక్కడమేంటి దక్కాల్సింది తనకే కాబట్టి, కేబినెట్ బెర్తు వచ్చిందని, సగర్వంగా చెప్పుకుంటున్నాడు. ప్రమాణస్వీకారం నుంచి ఇప్పటి వరకూ అన్నదమ్ములిద్దరూ పెద్దగా ముఖం ముఖం చూసుకున్న సందర్భం లేదు. అభినందించుకోవడం, ఆలింగనాలు చేసుకున్న పరిస్థితి కూడా లేదు. కానీ ప్రచ్చన్నయుద్ధాలు మాత్రం జరిగిపోతున్నాయి. ఇంతకీ మంత్రి పదవితో రగిలిపోతున్న ఆ అన్నదమ్ములెవరు?  సిక్కోలు వైసిపిలో అసంతృప్తి పర్వం మొదలయ్యిందా..? ఒక మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందా ఆ పదవి దక్కపోవడమే క్యాడర్ చీలిపోవడానికి కారణం కానుందా.. అయిష్టంగానే మంత్రికి స్వాగతం పలకడానికి కారణం ఏంటి..? నిమిషాల్లోనే ఫ్లేక్సీలు తొలగించడం వెనుక ఆంతర్యం ఏమిటి ..?? అసలు శ్రీకాకుళం జిల్లా వైసిపిలో ఏం జరుగుతోంది..? శ్రీకాకుళం జిల్లా వైసిపిలో అంతర్గత పోరు, అసంతృప్తిపర్వం తారాస్థాయికి చేరుతోంది. నిన్నమొన్నటి దాకా కలిసి ఉన్న నేతలే ఈరోజు ఎడమొఖం పెడమొఖంగా వ్యవహరిస్తున్నారు. పైకి కలిసి ఉన్నట్టుగా కనిపిస్తున్నా, లోలోపల మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు నూరుతున్నారు. కేవలం ఒక్క పదవి కోసమే ఇదంతా జరుగుతోందనే చర్చ, ఇప్పుడు జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆ పదవే ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరానికి దారితీసిందనే వాదన సైతం తాజాగా తెరపైకి వస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రి పదవుల రేసులో చాలామందే ఆశావాహులు ఉన్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయాలు అందులో కొందరికి రుచించలేదట. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఐదుగురు పేర్లు ఈ లిస్టులో కనిపించగా, అందులో ముఖ్యులుగా ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం నిలిచారు. జిల్లాకు లభించబోయే మంత్రి పదవిలో సీనియారిటీ, గత అనుభవాల దృష్ట్యా ధర్మాన ప్రసాదరావుకే మళ్ళీ మంత్రి పదవి లభిస్తుందని ఆయనతో పాటుగా ఆయన వర్గం ముందు నుంచే ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అయితే పార్టీ అధినేత నిర్ణయం ఊహలకు అందని విధంగా ధర్మాన సోదరులలో ధర్మాన ప్రసాదరావుకు కాక, ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి వరించింది. ఇప్పుడు ఇదే, పార్టీలో చేటు తెచ్చిపెట్టిందట. ధర్మాన ప్రసాదరావుకు కాకుండా కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోందట. మంత్రిగా అనేక పర్యాయాలు పనిచేసిన సుధీర్ఘ అనుభవం కలిగిన ధర్మాన ప్రసాదరావు కాకుండా, కృష్ణదాస్‌ను మంత్రిగా నియమించడంపై జిల్లా పార్టీలో వ్యతిరేక స్వరం మొదలయ్యిందట. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అగాథం పెంచిందట కేబినెట్ బెర్తు. ఈ నేపథ్యంలోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన కృష్ణదాస్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసినా, ధర్మాన ప్రసాదరావు వర్గం మాత్రం ఇందులో అయిష్టంగానే పాల్గొంది. మొదటిసారి మంత్రిగా జిల్లాకు వచ్చిన తన అన్నను రిసీవ్ చేసుకునేందుకు తమ్ముడైన ధర్మాన ప్రసాదరావు రాకపోవడమే ఇందుకు నిదర్శనమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. స్వాగత కార్యక్రమంలో కృష్ణదాస్‌కు ఆయన వర్గీయులకు మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. రైల్వే స్టేషన్ నుంచి పార్టీ కార్యాలయం చేరుకునే వరకు కృష్ణదాస్ కు స్వాగతం పలికేందుకు ఎక్కడా ధర్మాన ప్రసాదరావు రాలేదు. కనీసం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనకపోవడంతో పార్టీ శ్రేణుల్లో, ముఖ్యంగా కృష్ణదాస్ వర్గీయుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. కృష్ణదాస్ సైతం ధర్మాన ప్రసాదరావు కార్యక్రమానికి వస్తారని కొద్దిసేపు కార్యక్రమాన్ని వాయిదా వేసినా, ఆయన కార్యాలయం లోపల నుంచి బయటకు రాలేదు. దీంతో చేసేదేమిలేక కార్యక్రమాన్ని కొనసాగించారు పార్టీ శ్రేణులు. సొంత అన్న తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లాకు మొదటిసారి వస్తే కనీసం రాకపోవడంపై ఆవేదన చెందారట. అయితే ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యాలయంలోనే ఉండి కూడా, కార్యక్రమానికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు, ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోగానే, ప్రసాదరావు అనుచరులు చేసిన పని, అన్నదమ్ముల మధ్య వైరం ముదిరిందనడానికి మరో నిదర్శనం. ధర్మాన కృష్ణదాస్‌ ఫ్లైక్సీలను వెంటనే తొలగించారు ప్రసాద రావు అనుచరులు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో వాటిని సైతం ధర్మాన ప్రసాదరావు వర్గీయులు నిమిషాల వ్యవధిలో తొలగించారు అని జిల్లాలో కొందరు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల అంతర్గత విభేదాలతో పార్టీ బలహీన పడుతుందన్న చర్చ ఒకవైపు నడుస్తుండగానే, తాజాగా తెరపైకి వచ్చిన అన్నదమ్ముల పదవీ వైరం ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయట. మరి సోదరుల పంచాయితినీ, వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.


 


 

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM