by సూర్య | Fri, Jun 21, 2019, 04:24 PM
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 7.45 నుండి 8.45 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 నుండి 10.15 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
కాగా బ్రహ్మోత్సవాల్లో చేపట్టిన విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేశారు. రోజుకు 50 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణ, కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు