by సూర్య | Fri, Jun 21, 2019, 09:17 AM
వివిధ పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయింపుల జాడ్యం ఎక్కువైపోయిందంటూ పదే పదే బాధ పడే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సరికొత్త తలనొప్పి వచ్చింది. అదీ స్వరాష్ట్రం నుంచే ఎదురవుతుందని ఆయన ఊహించి ఉండరు. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై సభాపతులు మూడు నెలల్లో తీర్పు ఇవ్వాలని, ఇందుకు అవసరమైతే చట్టంలోనూ మార్పు చేయాలని, నేతలు పార్టీలు మారితే మారితే, పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేసి తీరాలని అనేక ప్రసంగాలలో తేల్చి చెప్పిన వెంకయ్యనాయుడు ఫిరాయింపు పిటిషన్లపై కోర్టులు కూడా వెంటనే తీర్పు చెప్పాలంటూ సూచించేవారు.
అంతవరకు బాగానే ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ్యులు కమలం తీర్ధం పుచ్చుకోవటం, తమ పదవులకు రాజీనామా చేయలేదు సరికదా... ఏకంగా పార్లమెంటరీ పార్టీనే బిజెపిలో విలీనం చేస్తున్నట్టు లేఖ ఇవ్వటంతో ఇంతకాలం తను ఏవైతే నీతులు వల్లె వేసారో... వాటికి తనే తూట్లు పొడిచే పరిస్థితి నెలకొందన్నది విశ్లేషకులు చెపుతున్న మాట. రాజ్యాంగం ప్రకారం మూడో వంతు సభ్యులు విలీనం కావచ్చన్నది టిడిపి ఎంపిల వాదన. గతంలో శరద్ యాదవ్ పార్టీ మారక ముందే ఆఘమేఘాల మీద వేటు వేసిన వెంకయ్య ఇప్పుడేం చేస్తారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరి కొన్నాళ్లు ఈ విషయం మీద వేచి చూడాలి.
Latest News