by సూర్య | Thu, Jun 20, 2019, 11:07 PM
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూపొందించిన మాస్టర్ప్లాన్ పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, తిరుచానూరులో అమ్మవారికి నూతన రథం, సూర్యప్రభ వాహనం, అప్పలాయగుంటలో నూతన రథం తయారీ పనులను వేగవంతం చేయాలన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో జెఈవో గురువారం వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోను టిటిడి వెబ్సైట్లో పొందుపరి చామన్నారు. పలు ప్రాంతాల్లో శ్రీవారి దివ్యక్షేత్రాల నిర్మాణానికి ఉద్దేశించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి)కు భక్తులు ఆన్లైన్లో విరాళాలు అందించే సౌకర్యం కల్పించామన్నారు. తిరుమలకు నీటి ఇబ్బందులు తొలగించేందుకు ఒక టిఎంసి నీటిని నిల్వ ఉంచేలా స్థల పరిశీలన చేపట్టాలని చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. టిటిడి రోడ్లలో విద్యుత్ వెలుగుల్లో శంఖుచక్రాలు కనిపించేలా ఏర్పాటుచేస్తున్న గోవిందమాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సప్తగిరి మాసపత్రిక చందాదారుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. భక్తులకు మరింత మెరుగ్గా సమాచారం అందించేలా టిటిడి కాల్సెంటర్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేపట్టామన్నారు.
Latest News