by సూర్య | Thu, Jun 20, 2019, 10:03 PM
విద్యార్థుల్లో భక్తిభావాన్ని పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనాగానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం రేణిగుంటలోని ఎపి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జెఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుండి భక్తిభావాన్ని అలవరుచుకోవడం ద్వారా జీవితంలో సక్రమమార్గంలో పయనించేందుకు వీలవుతుందన్నారు. అన్నమయ్య సంకీర్తనలను వినిపించడంతో పాటు వాటి భావాన్ని వ్యాఖ్యాన రూపంలో తెలియజేస్తున్నామని తెలిపారు. ధర్మప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తద్వారా శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేస్తున్నామని వివరించారు. 2 గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని, దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎపి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ఓఎస్డి శ్రీ డి.కౌండిన్యసాయి, టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య బి.విశ్వనాథ్, రేణిగుంట పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ జె.కృష్ణానాయక్, అన్నమాచార్య ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Latest News