by సూర్య | Fri, Mar 22, 2019, 10:28 PM
టిటిడి పరిధిలోని నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను శుక్రవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. . తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
శ్రీ అగస్తీశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9 నుండి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 14న నంది వాహనం, ఏప్రిల్ 17న కల్యాణోత్సవం, ఏప్రిల్ 18న రావణేశ్వర వాహనం, ఏప్రిల్ 19న కైలాసకోనలో త్రిశూలస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ కోలాటం, ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు పితామహులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా బాణపట్టమును అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.
Latest News