by సూర్య | Fri, Mar 22, 2019, 10:23 PM
అబ్కారీ సిబ్బందికి అతి త్వరలో బాడీ వార్న్ కెమెరాలు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేదము, అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎక్సైజ్ దాడులకు సంబంధించిన తక్షణ సమాచారం, ఆడియో, వీడియోలను ప్రత్యక్షంగా కేంద్ర కార్యాలయంలో వీక్షించగలిగేలా బాడీ వార్న్ కెమెరాలు పనిచేస్తాయని, వాటిని విజయవాడ కేంద్ర కార్యాలయంలోని ప్రధాన సర్వర్తో అనుసంధానం చేస్తామన్నారు. బాడీ వార్న్ కెమెరాలను శరీరానికి కళ్లుగా చెప్పవచ్చని, ఇప్పటి వరకు ఈ వ్యవస్ధలను పోలీసు శాఖ మాత్రమ వినియోగిస్తుందన్నారు. కోటి రూపాయల అంచనా వ్యయంతో విజయవాడ కమీషనరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను శుక్రవారం కమీషనర్ లాంఛనంగా ప్రారంభించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హరికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, మీనా మాట్లాడుతూ డిప్యూటి కమీషనర్ స్దాయి అధికారి నేతృత్వంలో సిసిసి పనిచేస్తుందని 24గంటలు సిబ్బంది సేవలు అందించేలా ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆలంబనతో అబ్కారీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను రూపొందించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యం డిపోలు, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, బీరు తయారీ కేంద్రాలు, చెక్ పోస్టులలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసామని, అక్కడి పరిణామాలను అనుక్షణం పరిశీలించే అవకాశం ఏర్పడిందని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. సిసిసిలో ఎనిమిది అతిపెద్ద ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేసామని, వాటిలో డిస్టలరీల కోసం రెండు, డిపోల కోసం రెండు, చెక్పోస్టులను పరిశీలించేందుకు రెండింటిని అంకితం చేయగా, మరో రెండు తెరలను ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ కోసం నిర్ధేశించామన్నారు. ప్రతి డిపో, డిస్టలరీలకు రెండు కెమెరాల వంతున 100 సిసి కెమెరాలు ఏర్పాటు చేసామని, అదే క్రమంలో చెక్ పోస్టుల వద్ద 31 సిసి కెమెరాలు ప్రత్యక్ష నిఘాలో సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసారు. ఎక్సైజ్ కంప్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఇసిఎంఎస్) సైతం మంచి ఫలితాలను ఇస్తుందని, నేరం జరిగిన ప్రాంతానికి సిబ్బంది చేరుకున్న మరుక్షణం అక్కడి ఫోటోలను కూడా ఆప్లోడ్ చేయాలని ఆదేశించామని, తద్వారా సిబ్బంది పనితీరును కూడా సమీక్షించే అవకాశం ఏర్పడుతుందని మీనా అన్నారు.
Latest News