by సూర్య | Thu, Mar 21, 2019, 11:39 PM
కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఏప్రియల్ 14వ తేదీన వ్రాత పరీక్ష 16, 17, 18వ తేదీలలో ఆన్లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు కోనేరు రాజా హరిన్ తెలిపారు. విజయవాడ మ్యూజియం రోడ్డులోని యూనివర్సిటీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవేశపరీక్షకు సంబంధించిన కర పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కోర్సులలో చేరాలనుకునే విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్లు, నగదు బహుమతులు అందించే ఉద్దేశంతో ఇటువంటి ప్రవేశపరీక్షను ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యారంగంలోనే కాకుండా క్రీడా, సాంస్కృతిక రంగాలలో జాతీయస్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సైతం స్కాలర్ షిప్లు అందిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఎల్.ఎస్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ సిఎస్ఈ, ఈసిఈ, ఈసిఎం, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, బయోటెక్నాలజీ తదితర కోర్సులను 50 ప్రత్యేకతల ద్వారా అందిస్తున్నామన్నారు. విద్యార్థులను అన్ని రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పూర్తి సౌలభ్యకర విద్యా విధానాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రపంచంలోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తమ విద్యా విధానాన్ని ఎప్పటికప్పుడు ఆధునికరిస్తున్నట్లు స్పష్టం చేశారు. యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ.రామకుమార్ మాట్లాడుతూ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్ అనే కొత్త కోర్సును తమ విశ్వవిద్యాలయంలో అందిస్తున్నామని తెలిపారు. భారత దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలలో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కోర్సులో విద్యార్థులు 1, 3, 5 సెమిస్టర్లు క్లాసులో చదువుకుంటారని, 2, 4, 6 సెమిస్టర్లో క్లాస్రూమ్లో నేర్చుకున్నది పరిశ్రమలలో చేస్తారని తెలిపారు. పరిశ్రమలలో పని చేస్తున్న విద్యార్థులకు 7000 నుంచి 10000 వరకూ స్టైఫండ్ లభిస్తుందన్నారు. విద్యార్థులు ఈ కోర్సు పూర్తి చేసుకున్న వెంటనే 100శాతం ప్లేస్మెంట్ లభిస్తుందన్నారు. యూనివర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ జే. శ్రీనివాసరావు మాట్లాడుతూ కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా 60 కేంద్రాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, 50 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం 160 మార్కులకు ఉంటుందని ఇందులో గణితం 80 మార్కులు, భౌతిక శాస్త్రం 40 మార్కులు, రసాయన శాస్త్రం 40 మార్కులకు ఉంటాయని, పరీక్షలో మైనస్ మార్కులు ఉండవని పేర్కొన్నారు. ఈ నెల 31న విశ్వవిద్యాలయం సందర్శించేందుకు గుంటూరు, విజయవాడ ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసామన్నారు.పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పూర్తి వివరాలు తమ యూనివర్సిటీ అధికారిక www.kluniversity.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని చెప్పారు.
Latest News