by సూర్య | Thu, Mar 21, 2019, 11:34 PM
రాష్ట్ర రాజధాని అమరావతిలో టిటిడి నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ పనులపై ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ గురువారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆలయాన్ని రెండేళ్లలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. ఆలయ నిర్మాణాన్ని శాస్త్రోక్తంగా చేపట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆగమ సలహాదారులను, అర్చకులను కోరారు. శిలాన్యాసం, ధాన్యాధివాసం, పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం, శయనాధివాసం ప్రక్రియల తరువాత మూలవిరాట్టును ప్రతిష్ఠిస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయంలో మూలవిరాట్టు, జయవిజయులు, శ్రీవకుళామాత, శ్రీ విష్వక్సేనులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ ఆంజనేయస్వామి తదితర విగ్రహాలను ఎక్కడెక్కడ ప్రతిష్ఠించాలనే విషయంపై చర్చించారు. ధ్వజస్తంభానికి అవసరమైన కొయ్యను సేకరించేందుకు ఇప్పటినుండే చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్వామివారి ఉత్సవాలకు అవసరమైన వివిధ వాహనాల తయారీ, రథమండపం నిర్మాణానికి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఈవో ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, ఆగమ సలహాదారులు శ్రీ సుందరవదన భట్టాచార్యులు, శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ ఎకె.నరసింహ దీక్షితులు, టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ పి.విశ్వనాథం, స్తపతి శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Latest News