by సూర్య | Thu, Mar 21, 2019, 06:36 PM
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వివిధ పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరో ఇప్పటికే దాదాపు ఖరారైయ్యాయి. రాజధాని జిల్లా అయిన ‘కృష్ణా జిల్లా’లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా…మరో ప్రధాన పార్టీ అయిన ‘జనసేన’ కూడా తన అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంది. ముందుగానే దాదాపు ముప్పావు వంతు అభ్యర్థులను ప్రకటించిన టిడిపిలోని కొంత మంది అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా టిడిపి అభ్యర్థుల ఎంపికలోనూ, ప్రచారంలోనూ తనదైన శైలిలో ముందుకువెళుతోంది. వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో..టిక్కెట్లు రాని వారు ఒకటి రెండు చోట్ల నిరసన వ్యక్తం చేసినా..అది ఒక రోజుకు మాత్రమే పరిమితమైంది. దీంతో…సీటు వచ్చిన వారంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. జిల్లాలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ..తమకు ఓటు వేయాలని కోరుతు న్నారు. గత ఐదేళ్లల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అడుగు తున్నారు. టిడిపి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వస్తోంది. దీంతో..జిల్లాల్లో ఎన్ని సీట్లు టిడిపికి వస్తాయనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మిగతా జిల్లాల కన్నా…కృష్ణా జిల్లా టిడిపి అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. కాగా…ప్రధాన ప్రతిపక్షంగా ఇంటి సమస్యలతో సతమత మవుతుండగా…టిడిపి అభ్యర్థులు మొదట విడత ప్రచారాన్ని దాదాపు పూర్తి చేయబోతున్నారు.
Latest News