by సూర్య | Wed, Mar 20, 2019, 11:14 PM
వైకాపాలో సీట్లు దక్కని నేతలు జగన్పై దాదాపు దాడి చేసినంత పనిచేస్తున్నారు. ఇప్పటికే తమదైన శైలిలో నిరసన వ్యక్తంచేయటం, ఆత్మహత్యకు పాల్పడటంతో పాటు విశాఖలో పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనలూ జరుగుతున్నాయి. ఇప్పుడు వైకాపా అధ్యక్షుడు జగన్ చిన్నాన్న సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వంతు వచ్చిన ట్టుంది. గతంలో తనపై పోటీ చేసి ఓడిన తెదేపా నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీలో చేరుతారన్న నాటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మాగుంట పార్టీలో చేరాక కనీసం తనకు చెప్పకుండానే తనని తప్పించడంతో పాటు ఆతనికి సీటు కేటాయింపుపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వైకాపా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల జగన్ జరిపిన ప్రచారానికి దూరంగాఉన్న ఆయన పశ్చిమ ప్రకాశంలోని తన వర్గం ఎన్నికల ప్రచారానికి పోవద్దని సూచించినట్టు తెలుస్తోంది. ఒంగోలు లోక్సభ సీటు తనకు దక్కకపోవడంపై ఆయన కినుక వహించిన వైవీ సుబ్బారెడ్డి విదేశాలకు వెళ్లారని ఆయన వర్గీయులు చెబుతున్నా ఎన్నికల సమయంలో ఆయన ప్రచారానికి దూరం కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
Latest News