by సూర్య | Wed, Mar 20, 2019, 03:11 PM
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే అన్నీ పోయాయని.. రుణమాఫీ లేక, సున్నా వడ్డీ రుణాలందక రైతులు, మహిళలు మోసపోయారని.. కరువు వచ్చిందని, పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు విలవిల్లాడారని.. కాలేజీల్లో ఫీజులు పెరిగాయని, మరోవైపు ఉన్న ఉద్యోగాలు పోయాయని.. ఆరోగ్యశ్రీ పథకం నీరు గారిందని, ఇంకా 108 సర్వీసులు పని చేయడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.అయిదేళ్లుగా అలాంటి అన్యాయమైన పాలన చూస్తున్నామన్న ఆయన, మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మనకు ఎలాంటి నాయకుడు కావాలన్నది ప్రతి ఒక్కరూ గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలని కోరారు. అబద్ధాలు చెప్పే వాడు, మోసాలు చేసేవాడూ మనకు నాయకుడిగా కావాలా అని? ఆలోచించమని వైయస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం, టంగుటూరులో బుధవారం ఉదయం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలి రావడంతో పట్టణంలో అంతులేని సందడి నెలకొంది. ఈ అయిదేళ్లు చంద్రబాబు పాలన చూశాం కాబట్టి, మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఒక్కసారి ఆలోచించాలని వైయస్ జగన్ కోరారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి, వాటన్నింటిని తుంగలో తొక్కిన చంద్రబాబు, సీఎం హోదాలో ఇచ్చిన వాటిని కూడా నిలబెట్టుకోలేదని చెప్పారు.సాక్షాత్తూ అసెంబ్లీలోనూ, పలు మార్లు ప్రకాశం జిల్లా పర్యటనలోనూ చంద్రబాబు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా జననేత ప్రస్తావించారు. అవి అమలయ్యాయా? అని ప్రశ్నించారు.
Latest News