by సూర్య | Tue, Mar 19, 2019, 07:20 PM
మాజీ మంత్రి దాడి వీరభద్రరావును వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ అధినేత జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. దాడి వీరభద్రరావుకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. జగన్ స్వయంగా దాడి వీరభద్రరావుకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. వైసీపీ అనకాపల్లి ఎంపీ సీటులో పరిశీలకుడిగా నియమించారు.
ఇటీవలనే దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో కలిసి వైసీపీలో చేరారు. విశాఖ జిల్లాలో అనకాపల్లి సీటును దాడి కుటుంబానికి ఇస్తారని ప్రచారం సాగింది.కానీ దాడి కుటుంబానికి టిక్కెట్టు దక్కలేదు. అనకాపల్లి వైసీపీ టికెట్ ను దాడి వీరభద్రరావు ఆశించారు. అయితే టికెట్ కేటాయించకపోవడంతో... వైసీపీలో దాడి కుటుంబం కొనసాగుతుందా, లేదా? అనే చర్చ తెరపైకి వచ్చింది. వైసీపీని వీడుతారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకులను పార్టీ పదవుల్లో నియమించడం ద్వారా సమస్యకు జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు.
ఇదే సమయంలో దాడి కుమారుడు రత్నాకర్ ను అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. ఈ విషయాన్ని వీరభద్రరావుకు జగన్ స్వయంగా ఫోన్ చేసి తెలియజేసినట్టు సమాచారం.